Strait of Hormuz : ఇండియాకు మరో గుడ్ న్యూస్. చమురు ఉన్న రెండు భారత నౌకలు హార్ముజ్ జలసంధి నుంచి బయల్దేరాయి. వీటికి భారత నేవీ రక్షణ కల్పిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన చమురు నౌకలు జలసంధి మార్గంలో సముద్రంపై నిలిచిపోయాయి. పరిమితంగా ఇరాన్ కొన్ని నౌకలకు అనుమతిస్తోంది.
వాటిలో ఇండియా నౌకలు కూడా ఉన్నాయి. భారత నౌకలకు ఇరాన్ ప్రత్యేక అనుమతులిస్తోంది. దీంతో కొన్ని నౌకలు ఇండియా చేరుకుంటున్నాయి. ఇటీవలే శివాలిక్, నందా దేవి నౌకలు ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ట్యాంకర్స్ పైన్ గ్యాస్, జగ్ వసంత్ నౌకలు కూడా హార్ముజ్ నుంచి వచ్చేశాయి. అయినప్పటికీ ఇంకా ఇండియా నౌకలు సహా అనేక దేశాల నౌకలు సముద్రంలో అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. అలాగే, ఈ మార్గం నుంచి బయల్దేరే నౌకలు అన్నీ ఒకే మార్గంలో వెళ్లడం లేదు. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు, మార్గాలను బట్టి తమ రూట్స్ మార్చుకుని వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తున్నాయి. అలాగే, అక్కడ జీపీఎస్ సేవలు కూడా అందడం లేదు. దీంతో నౌకలు కదలడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో భారతీయ వాణిజ్య నౌకలకు రక్షణగా, ఇండియన్ నేవీకి సంబంధించిన నౌకలు సాయమందిస్తున్నాయి.
గల్ఫ్ ప్రాంతంలో భారతీయ నౌకలు మోహరించారు. మన నౌకలు సురక్షితంగా ఇండియా చేరే వరకు నేవీ నౌకలు రక్షణగా ఉంటున్నాయి. అంతర్జాతీయ నౌకా రవాణాకు సంబంధించి హార్ముజ్ జలసంధి చాలా కీలకం. ప్రపంచంలో 20 శాతం చమురు ఈ మార్గం గుండానే వెళ్తుంది. అలాంటిది ఈ జలసంధి ఇప్పుడు మూసి ఉండటంతో అనేక దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.