Metro Station | ఢిల్లీలో పేలుడు ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చారిత్రాత్మక ఎర్రకోట (Red Fort) సమీపంలోని మెట్రో స్టేషన్ (Delhi Blast) దగ్గర ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు ఎర్రకోట మెట్రో స్టేషన్ (Metro Station)ను మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా దాడి జరిగిన నాలుగు రోజుల అనంతరం ఇవాళ ఆ మెట్రో స్టేషన్ను అధికారులు తెరిచారు (Metro Station Reopens). ప్రస్తుతానికి గేట్ నంబర్ 2, 3ని ఓపెన్ చేశారు. 1, 4 గేట్లను మాత్రం అధికారులు ఇంకా తెరవలేదు.
మరోవైపు ఈ పేలుడు ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. కారు నడిపిన డాక్టర్ ఉమర్ నబీ బాంబు తయారీలో నిపుణుడని సంబంధిత వర్గాలు తాజాగా తెలిపాయి. ఇప్పటి వరకూ ఘటనాస్థలి నుంచి సేకరించిన దాదాపు 52కిపైగా పేలుడు పదార్థాల నమూనాలను ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. ఎర్రకోట (Red Fort) వద్ద పేలుడుకు రెండు కిలోలకు పైగా అమ్మోనియం నైట్రేట్ (Ammonium Nitrate) ఉపయోగించినట్లు గుర్తించారు.
దాంతోపాటూ పెట్రోలియం (Petroleum) వంటివి కూడా ఉపయోగించి పేలుడు పదార్థాన్ని తయారు చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఇలాంటి పేలుడు పదార్థాలను కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే తయారు చేయొచ్చని ఫోరెన్సిక్ వర్గాలు వెల్లడించాయి. పేలుడుకు ముందు ఉమర్ పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటూ ఏం చేశాడన్న దానిపై అధికారులు దార్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలోనే పేలుడు పదార్థాన్ని తయారు చేశాడా..? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
Also Read..
Apple CEO | యాపిల్ను వీడనున్న టిమ్ కుక్.. ఆయన తర్వాత సీఈవో ఎవరు..?