ముంబై: ఇద్దరు విదేశీయులు బోర్డింగ్ పాస్లు (Boarding Passes) మార్చుకున్నారు. విమానాల్లో వేర్వేరు దేశాలకు వెళ్లారు. ఈ విషయం బయటపడటంతో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల శ్రీలంక జాతీయుడు, 36 ఏళ్ల జర్మనీ జాతీయుడు సోమవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాయిలెట్లో తమ తమ బోర్డింగ్ పాస్లను మార్చుకున్నారు. బ్రిటన్ రాజధాని లండన్కు శ్రీలంక జాతీయుడు, నేపాల్ రాజధాని ఖాట్మండుకు జర్మనీ జాతీయుడు ఆయా విమానాల్లో వెళ్లారు.
కాగా, లండన్ చేరుకున్న తర్వాత శ్రీలంక జాతీయుడి పాస్పోర్ట్పై ఉన్న డిపార్చర్ స్టాంప్ను ఫోర్జరీ చేసినట్లు ఆ ఎయిర్లైన్ సంస్థ సిబ్బంది గుర్తించారు. బోర్డింగ్ పాస్పై ఉన్న నంబర్, డిపార్చర్ స్టాంప్పై ఉన్న నంబర్ వేర్వేరుగా ఉండటాన్ని గమనించి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్రమంగా లండన్ చేరుకోవాలని భావించిన శ్రీలంక జాతీయుడు దొరికిపోవడంతో అసలు విషయం చెప్పాడు. దీంతో లండన్ విమానాశ్రయం అధికారులు మంగళవారం అతడ్ని తిరిగి ముంబైకి పంపారు.
మరోవైపు ముంబై విమానాశ్రయానికి చేరుకున్న శ్రీలంక జాతీయుడ్ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పాడు. ఈ నెల 9న తాను, జర్మనీ జాతీయుడు ఎయిర్పోర్ట్ సమీపంలోని ఓ హోటల్లో బస చేసినట్లు తెలిపాడు. అక్కడ కలిసినప్పుడు బోర్డింగ్ పాస్లు మార్చుకోవాలని ప్లాన్ వేసినట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఖాట్మండు బోర్డింగ్ పాస్ కలిగి ఉన్న జర్మనీ జాతీయుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు విదేశీయులు బోర్డింగ్ పాస్లు మార్చుకున్న సంఘటనలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉన్నదా అన్నదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: