రాయ్పూర్ : లవ్ జీహాద్ గురించి పదేపదే మాట్లాడే కాషాయ పార్టీకి చత్తీస్ఘఢ్ సీఎం (Chhattisgarh CM) భూపేష్ బాఘేల్ చురకలు అంటించారు. బీజేపీ సీనియర్ నేతల కుమార్తెలు ముస్లింలను వివాహం చేసుకుంటే అది లవ్ జీహాద్ కిందకు రాదా అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ నేతల కూతుర్లు ముస్లింలను పెండ్లి చేసుకుంటే దాన్ని ప్రేమ అంటున్నారని, అదే ఇతరులు ఆ పని చేస్తే జీహాద్ అనే పదం వాడుతున్నారని దుయ్యబట్టారు. చత్తీస్ఘఢ్కు చెందిన బీజేపీ సీనియర్ నేత కూతురు ఎక్కడికి వెళ్లిందో అడగాలని అన్నారు. వారి కూతురు విషయంలో లవ్ అయితే, ఇతరుల విషయంలో మాత్రం లవ్ జీహాద్ ఎలా అవుతుందని నిలదీశారు.
బిరాన్పూర్లో విలేకరులతో మాట్లాడిన భూపేష్ బాఘేల్ ఈ ప్రాంతంలో జరిగిన మత ఘర్షణల నుంచి రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బంద్ పిలుపు ఇచ్చే ముందు ఇక్కడి అల్లర్ల గురించి కాషాయ పార్టీ ఎలాంటి పరిశీలన చేపట్టలేదని మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఆరాటపడుతోందని అన్నారు. లవ్ జీహాద్ అంశం నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
Read More