INDIA Bloc | న్యూఢిల్లీ, మార్చి 31: లోక్సభ ఎన్నికల వేళ విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, పలువురు కీలక నేతల అరెస్టుల నేపథ్యంలో ఇండియా కూటమి ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ‘సేవ్ డెమొక్రసీ’ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నిరంకుశం ఎల్లకాలం సాగదని, కేజ్రీవాల్ను ఎక్కువకాలం జైల్లో ఉంచలేరని పేర్కొన్నారు.
తన భర్తను ఆమె సింహంతో పోల్చారు. ఈ సందర్భంగా ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ ఇచ్చిన సందేశాన్ని ఆమె చదివి వినిపించారు. అందులో ఇండియా కూటమి తరఫున ఆరు గ్యారెంటీలు ఉన్నాయి. అందులో ఢిల్లీకి రాష్ట్ర హోదా, పేదలకు ఉచిత విద్యుత్తు వంటివి ఉన్నాయి. కార్యక్రమంలో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ కూడా పాల్గొన్నారు.
‘మ్యాచ్ ఫిక్సింగ్’తో గెలిచేందుకు కుట్రలు
విపక్ష నేతలు మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కేంద్రంలోని బీజేపీ విపక్షాలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘మ్యాచ్ ఫిక్సింగ్’ ద్వారా లోక్సభ ఎన్నికల్లో గెలువాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. అంపైర్లను ఆయననే ఎంపిక చేసుకోవడం ద్వారా, ప్లేయర్లను(విపక్ష నేతలను) జైల్లో పెట్టడం ద్వారా గెలవాలని అనుకొంటున్నారని పేర్కొన్నారు.
బీజేపీ మళ్లీ గెలిస్తే ఆ పార్టీ దేశ రాజ్యాంగాన్నే మారుస్తుందని అన్నారు. ఈవీఎంలు, మ్యాచ్ఫిక్సింగ్, మీడియా ఒత్తిడి లేకుండా బీజేపీ 180 లోక్సభ సీట్లు కూడా గెలువలేదని రాహుల్ పేర్కొన్నారు. ఐక్యత ద్వారానే మోదీని ఓడించగలమని, సమాఖ్య భారత్ నుంచి ఫాసిస్టు బీజేపీని తరిమికొట్టగలమని తమిళనాడు సీఎం స్టాలిన్ అభిప్రాయపడ్డారు.
లోక్సభ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార బీజేపీ విపక్ష నేతలను అరెస్టులు చేయిస్తున్నదని ఆయన తరపున సందేశాన్ని వినిపించిన డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ పేర్కొన్నారు. విపక్షాల ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, శరద్ పవార్, ఆర్డేడీ నేత తేజస్వీ యాదవ్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, పీడీపీ చీఫ్ ముఫ్తీ, ఎన్సీ నేత ఫరూక్ అబ్ధుల్లా, టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రియన్ తదితరులు పాల్గొన్నారు.
ఈసీకి 5 డిమాండ్లు
ఇండియా కూటమి ఈ సందర్భంగా ఈసీకి ఐదు డిమాండ్లు చేసింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని డిమాండ్ చేసింది. ఈడీ అరెస్టు చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ను వెంటనే విడుదల చేయాలని, విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీ తీసుకొంటున్న బలవంతపు చర్యలను నిలిపివేయాలని, ప్రతిపక్షాలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆపాలని, అదేవిధంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అధికార బీజేపీకి పెద్దమొత్తంలో వచ్చిన విరాళాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్తో దర్యాప్తు చేయించాలనే డిమాండ్లు ఈసీ ముందు పెట్టింది.