Earthquake : జమ్ముకశ్మీర్లో మళ్లీ భూకంపం చోటుచేసుకుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో అక్కడ భూకంపం సంభవించడం ఇది రెండోసారి. ఇవాళ (శనివారం) మధ్యాహ్నం 2.53 గంటల ప్రాంతంలో కిష్ట్వార్లో భూకంపం వచ్చింది. ఈ భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 3.8 గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఈ విషయాన్ని వెల్లడించింది. భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
అంతకు ముందు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కూడా జమ్ముకశ్మీర్లో భూకంపం సంభవించింది. ఆ భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 3.2 గా నమోదైంది. అయితే 24 గంటల్లో రెండు భూకంపాలు సంభవించినా అదృష్టవశాత్తు వాటి తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టంగానీ, ఆస్తి నష్టంగానీ సంభవించలేదు.