బెంగళూరు, అక్టోబర్ 27: కలుషిత నీరుతాగి కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్లో ఇద్దరు మృతిచెందిన ఘటన మరువకముందే బెళగావి జిల్లాలో మరొక విషాదం చోటుచేసుకొన్నది. కలుషిత నీరు తాగి 70 ఏండ్ల వృద్ధుడు మృత్యువాతపడ్డాడు. ముదేనూరు గ్రామంలో తాజా మరణం నమోదైంది. ఈ గ్రామంలో కలుషిత నీరుతాగి 94 మంది దవాఖాన పాలయ్యారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
శివప్ప అనే వృద్ధుడు (70) మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం శివప్ప అస్వస్థతకు గురయ్యాడని స్థానికులు పేర్కొన్నారు. అక్టోబర్ 23న నల్లా పైపు పగిలిపోయి తాగేనీటిలో కలుషిత నీరు కలిసిందని తెలిపారు. ఈ నీటిని తాగినవారందరికీ వాంతులు, విరేచనాలు, కడపునొప్పిలాంటి లక్షణాలు కనిపించాయన్నారు. పెద్దసంఖ్యలో దవాఖానపాలైనా బీజేపీ సర్కారు పట్టించుకోవడం లేదని ముదేనూరు గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇంతవరకూ ప్రజాప్రతినిధులెవరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.