POK | న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన రెండు పెద్ద తప్పిదాల వల్ల కశ్మీర్ ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా కష్టాలు, బాధలు పడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆరోపించారు. కశ్మీర్ మొత్తాన్ని మన అధీనంలోకి తీసుకోకుండా కాల్పుల విరమణను ప్రకటించడం, అదేవిధంగా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకెళ్లడం ఆ రెండు తప్పిదాలని, దీనికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నారు. బుధవారం జమ్ముకశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ) బిల్లు, జమ్ముకశ్మీర్ రిజర్వేషన్(సవరణ) బిల్లును లోక్సభ ఆమోదించింది. అంతకుమందు ఈ రెండు బిల్లులపై సభలో జరిగిన చర్చకు హోంమంత్రి అమిత్షా సమాధానం ఇచ్చారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) భారత్లో భాగమేనని ఈ సందర్భంగా ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు రీఆర్గనైజేషన్(సవరణ) బిల్లు ప్రకారం జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపాదనల ప్రకారం పెంచిన 90 సీట్లలో 24 సీట్లను పీవోకేకు రిజర్వ్ చేస్తున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా రెండు స్థానాలను కశ్మీరీ వలస కమ్యూనిటీకి, ఒక స్థానాన్ని పీవోకే నుంచి స్థిరపడిన వారికి రిజర్వ్ చేసినట్టు అమిత్షా తెలిపారు. తొలిసారిగా ఎస్సీ/ఎస్టీ కమ్యూనిటీలకు 9 స్థానాలు కేటాయించినట్టు పేర్కొన్నారు.
బిల్లులకు చర్చకు సమాధానం సందర్భంగా అమిత్షా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. నెహ్రూ సరైన చర్యలు, నిర్ణయాలు తీసుకొని ఉంటే పెద్ద భూభాగాన్ని వదులుకొనే వాళ్లం కాదని, నేడు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)గా ఉన్న ప్రాంతం భారత్లో భాగమయ్యేదని అన్నారు. నెహ్రూ హయాంలో జరిగిన తప్పుల(నెహ్రూవియన్ బ్లండర్స్) వల్ల నేడు కశ్మీర్ ఏండ్లుగా కష్టాలు పడాల్సి వస్తున్నదని అన్నారు. ‘మన ఆర్మీ విజయవంతంగా పంజాబ్ ప్రాంతానికి చేరుకొన్న వెంటనే కాల్పుల విరమణను ప్రకటించారు. దీని వలనే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) పుట్టుకొచ్చింది. మూడు రోజుల తర్వాత గనుక ఈ కాల్పుల విరమణను ప్రకటించి ఉంటే.. పీవోకే భారత్లో భాగంగా ఉండేది’ అని అమిత్షా దుయ్యబట్టారు.
నెహ్రూపై అమిత్షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన సభ్యులు.. కొంత సేపటి తర్వాత మళ్లీ సభకు తిరిగి వచ్చారు. కాంగ్రెస్ ఎంపీల వాకౌట్ అనంతరం బీజేపీ ఎంపీ భర్తృహరి మహ్తాబ్ మాట్లాడుతూ 1962లో చైనాతో యుద్ధానికి దారితీసిన ‘హిమాలయన్ తప్పిదాల’ గురించి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్షా మాట్లాడాలన్నారు. దీనికి షా స్పందిస్తూ ‘నేను నెహ్రూ చేసిన రెండు తప్పిదాల గురించి మాట్లాడితే కాంగ్రెస్ ఎంపీలు కలవరపడి సభ నుంచి వాకౌట్ చేశారు. అదే హిమాయలన్ బ్లండర్స్ గురించి కూడా మాట్లాడితే రాజీనామా చేస్తారేమో!’ అంటూ చమత్కరించారు. కశ్మీర్ సమస్యను అంత అత్యవసరంగా ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకెళ్లకుండా ఉండాల్సిందని అన్నారు.
లోక్సభ ఆమోదించిన జమ్ముకశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ) బిల్లు, జమ్ముకశ్మీర్ రిజర్వేషన్(సవరణ) బిల్లులో పలు కీలక అంశాలు ఉన్నాయి. గతంలో జమ్ముకశ్మీర్లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 83 ఉండగా.. తాజా రీఆర్గనైజేషన్ బిల్లులో దాన్ని 90కి పెంచాలని ప్రతిపాదించారు. ఇంతకుముందు కశ్మీర్ డివిజన్లో 46, జమ్ము డివిజన్లో 37 స్థానాలు ఉండేవి. ఇప్పుడు వాటిని వరుసగా 47, 43కు పెంచారు. రిజర్వేషన్ సవరణ బిల్లు ప్రకారం ఉద్యోగ నియామకాలు, విద్యా ప్రవేశాల్లో అర్హులైన పలు వర్గాలకు రిజర్వేషన్లలో మార్పులు చేయనున్నారు. కాగా, పీవోకే నుంచి వలస వచ్చిన వారికి జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో కేవలం ఒక సీటు మాత్రమే రిజర్వ్ చేయడంపై ఎస్వోఎస్ చైర్పర్సన్ రాజీవ్ చుని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము 17 లక్షలు ఉన్నామని, అయితే 3 లక్షలు ఉన్న కశ్మీరీ వలస కమ్యూనిటీకి రెండు సీట్లు ఇచ్చారని అన్నారు.
మరోవైపు హిందీ రాష్ర్టాలను ఉద్దేశించి డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బుధవారం కూడా లోక్సభలో రగడ కొనసాగింది. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని ఎంపీ సెంథిల్ సభలో ప్రకటించడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల బీజేపీ గెలిచిన మూడు రాష్ర్టాలను ఉద్దేశించి మంగళవారం లోక్సభలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ మాట్లాడే ప్రాంతాలన్నీ ‘గోమూత్ర రాష్ర్టాలు’ అని, బీజేపీ అక్కడ మాత్రమే విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ర్టాల్లో ఆ పార్టీ గెలవలేదని అన్నారు.