భారత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కోర్టుకెక్కింది. గతేడాది నుంచి రకరకాల పోస్టులు తొలగించాలంటూ భారత ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా సంస్థలకు ఉత్తర్వులు అందాయి. ప్రభుత్వ చర్యలపై దుష్ప్రచారం చేస్తున్న పోస్టులను తొలగించాలని కొత్త ఐటీ రూల్స్ చెప్తున్నాయి.
అయితే వీటిలో కొన్ని రిక్వెస్ట్లు సమంజసంగా లేవని, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని ట్విట్టర్ కేసు వేసింది. కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధికారిక ఖాతాలు పెట్టిన పోస్టులను తొలగించాలని తమకు ఆదేశాలు వచ్చాయని, కానీ అలా చేయడం అంటే భావ ప్రకటనా స్వేచ్ఛను తుంగలో తొక్కేయడమేనని ఈ సోషల్ మీడియా సంస్థ వాదిస్తోంది.
అయితే కొత్త ఐటీ రూల్స్ ప్రకారం, దేశ భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని రకాల కంటెంట్ ప్రజలకు అందుబాటులో లేకుండా బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాము చెప్పిన కంటెంట్ను తొలగించకపోతే క్రిమినల్ కేసులు పెడతామని భారత ఐటీ శాఖ అధికారులు చెప్తున్నారని, ఇది అధికార దుర్వినియోగమని ట్విట్టర్ ఆరోపించింది.