న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ ఎగుమతి సుంకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దేశంలో ఉప్పుడు బియ్యం ధరలను అదుపులో ఉంచేందుకే తాము వాటి ఎగుమతులపై ఎక్స్పోర్ట్ డ్యూటీ విధించామని సంబంధిత నోటిఫికేషన్లో సర్కారు పేర్కొంది.
కాగా, దేశంలో లభ్యత పెంచేందుకు గత ఏడాది బ్రోకెన్ రైస్ (నూకలు) ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దేశంలో ఎక్కువగా వినియోగమయ్యే నాన్ బాస్మతి తెల్ల బియ్యం ధరలు పెరిగిపోవడంతో.. గత నెల వాటి ఎగుమతులను కూడా ప్రభుత్వం నిషేధించింది. ఉల్లిగడ్డల ధరల నియంత్రణ కోసం గత వారం ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.