తిరుమల: తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. నిత్యం గోవింద నామాలతో మారుమోగే పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంలో.. గత కొంతకాలంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాజకీయ నాయకులలో కొంతమంది, దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతున్నది.
ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానించింది. తిరుమలకు విచ్చేసి రాజకీయ విమర్శలు చేసే వ్యక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతీసే ప్రసంగాలకు దూరంగా ఉండి టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
జనవరి 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనం
తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది. పది రోజులపాటు జరిగే దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీఐపీలు మినహా.. ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి వెల్లడించారు. జనవరి 10న స్వర్ణరథం ఊరేగింపు, 11న చక్రస్నానం నిర్వహించనున్నట్టు తెలిపారు.