భద్రాచలం, చుంచుపల్లిలో పట్టుబడిన నిందితులు
నాలుగు వాహనాలు స్వాధీనం
పట్టుబడిన సరుకు విలువ రూ.77 లక్షలు
భద్రాచలం/ చుంచుపల్లి, మార్చి 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో, చుంచుపల్లిలో 500 కిలోల గంజాయి పట్టుబడింది. భద్రాచలం పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ వినీత్ ఆ వివరాలు వెల్లడించారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో పట్టణ సీఐ స్వామి ఆధ్వర్యంలో ప్రొబేషనరీ ఎస్సైలు రాము, రంజిత్కుమార్లు తమ సిబ్బందితో బ్రిడ్జి సెంటర్లోని ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక బొలేరో వాహనం, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనంపై నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు వారిని ఆపి వాహనాలను తనిఖీ చేశారు. వాటిల్లో 300 కేజీల గంజాయి ఉంది. దీని విలువ రూ.45 లక్షలు ఉంటుంది. నిందితులను ప్రశ్నించగా తమ పేర్లు దునియా, నాయక్ రాజేశ్, డోంగ్రి రాజేశ్ అలియాస్ టుబే, బిసాయి డోము అలియాస్ సాయి, అలియాస్ సుదర్శన్ అని చెప్పారు. నిందితులు ఆంధ్రప్రదేశ్లోని డొంకరాయికి చెందిన వారు. సీలేరులో గంజాయిని కొనుగోలు చేసి సారపాక వైపు రవాణా చేస్తున్న క్రమంలో పట్టుబడ్డారు.
చుంచుపల్లిలో 200 కిలోలు..
కర్నాటక రాష్ర్టానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తరలిస్తున్న గంజాయిని చుంచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. చుంచుపల్లి పోలీస్స్టేషన్లో వివరాలను కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్రాజ్ వెల్లడించారు. చుంచుపల్లి ఎస్సై మహేశ్ ఆదివారం ఉదయం 8 గంటలకు చుంచుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపునకు వెళ్తున్న టీఎస్ 12 ఈఈ 1433 నంబర్ గల కారులో కర్ణాటక రాష్ర్టానికి చెందిన అఫ్రోజ్, పరశురాంలు సుమారు 200 కేజీల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. వీరిని విచారించగా ఏపీలోని చింతూరు సరిహద్దు గ్రామాల నుంచి సుమారు రూ.32 లక్షల విలువైన గంజాయిని కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన నదీమ్ అనే వ్యక్తి ఆదేశాలతో తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. అఫ్రోజ్, పరశురాంలపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్ చేసినట్లు తెలిపారు. గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపుతామని పోలీసులు తెలిపారు.