న్యూఢిల్లీ: జై తెలంగాణ నినాదాలు లోక్సభలో దద్దరిల్లాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు లోక్సభలో ఆందోళన చేపట్టారు. తెలంగాణలో ధాన్యం సేకరించాలంటూ నామా నాగేశ్వర రావు నేతృత్వంలోని ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఆకుపచ్చ కండువాలు ధరించిన టీఆర్ఎస్ ఎంపీలు.. వరిధాన్యం సేకరణపై జాతీయ విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లోకి దూసుకువెళ్లిన టీఆర్ఎస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇవాళ ఉదయం టీఆర్ఎస్ పార్టీ ధాన్యం సేకరణపై వాయిదా తీర్మానం ఇచ్చిన విషయం తెలిసిందే.