న్యూఢిల్లీ: పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ కూడా ఉభయసభల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ధాన్యం సేకరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లోక్సభలో స్పీకర్ పోడియం వద్ద ఎంపీలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ రైతులకు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. ధాన్యం సేకరణపై జాతీయ విధానం ప్రకటించాలని కూడా ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్ష టన్నుల ధాన్యం కుళ్లిపోయే పరిస్థితి వచ్చిందని, ఆ ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని రాజ్యసభ ఎంపీ కేశవరావు డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని కోరారు. యాసంగి ధాన్యం సేకరణలో కేంద్రం వివక్ష చూపుతోందని కేకే అన్నారు.