న్యూఢిల్లీ : తెలంగాణ రైతాంగం బాధలను పట్టించుకోని కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. రైతు సమస్యలపై పార్లమెంట్లో తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రం సరైన సమాధానం ఇవ్వలేదు. రైతులతో రాజకీయం చేయొద్దు అని ఎంపీ హెచ్చరించారు.
పార్లమెంట్ సమావేశాలను బాయ్కాట్ చేసిన అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎంపీ నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొంటారా? కొనరా? అని కేంద్రాన్ని అడిగాం. ఈ అంశంపై పార్లమెంట్ సాక్షిగా 9 రోజుల పాటు టీఆర్ఎస్ ఎంపీలమంతా నిరసన తెలిపాం. ఎవరూ ఊహించని విధంగా పోరాటం చేశాం. మా సమస్యకు పరిష్కారం చూపాలని నిరసన తెలిపాం. బీజేపీ నాయకులు తమను పట్టించుకోలేదు. తమ రైతాంగం రెండు పంటలను పండిస్తుంది. ధాన్యం కొంటారా? కొనరా? అని అడిగాం. బాయిల్డ్ రైస్ విషయంలో డొంక తిరుగుడు సమాధానాలు చెప్పారు. పార్లమెంట్లో మేం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదు. తెలంగాణ రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోంది. దున్నపోతు మీద వాన పడ్డట్టు బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ రైతుల ఓట్లతో గెలిచిన కొందరు ఎంపీలు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారు. ఒకటే స్టేట్మెంట్ ఇవ్వాలని కోరాం. బాయిల్డ్రైస్ కొంటారా? కొనరా? అని అడిగాం. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీల సంగతి తేల్చాలి. చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ రైతులను అవమాన పరిచినట్లు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కట్టడం, చెరువులను, కుంటలను బాగు చేయడంతో సాగు పెరిగింది. 24 గంటల నాణ్యమైన విద్యుత్, రైతుబంధు అందిస్తున్నాం. రైతును కాపాడుకోవడానికి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు అని ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.