న్యూఢిల్లీ : కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వాయిదా తీర్మానం నోటీసును ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ జరపాలని ఎంపీలు కోరారు. కానీ టీఆర్ఎస్ ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసును ఇటు స్పీకర్, అటు చైర్మన్ తిరస్కరించారు. దీంతో ఉభయసభల నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు మాట్లాడుతూ.. వెనుకబడిన కులాల వారిగా జన గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్టీఐ ప్రకారం ఉద్యోగుల్లో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. కులాల వారీగా జన గణన జరిగితే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వాలు 75 ఏళ్లుగా చేసిందేమీ లేదన్నారు. పార్లమెంట్లో ప్రతి అంశంపైనా ఫోకస్ చేసి చర్చకు పట్టుబడుతున్నాం.. చర్చ జరగకపోతే వాకౌట్ చేస్తున్నామని తెలిపారు.
సామాజిక న్యాయం విషయంలో కేంద్రం దిగజారి వ్యవహరిస్తోందని ఎంపీ కేకే మండిపడ్డారు. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించని ప్రభుత్వానికి అధికారంలో ఉండే హక్కు లేదని స్పష్టం చేశారు. వేల సంవత్సరాల నుంచి సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల వారు పోరాడుతూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు బీసీల కుల జన గణన అంశాన్ని పార్లమెంట్ లో లెవనెత్తుతామని ఎంపీ కేకే స్పష్టం చేశారు.