అగర్తల: త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 20 మంది మహిళలున్నారు. రాష్ట్రంలో 28.13 లక్షల ఓటర్లుండగా, అందులో మహిళలు 13.53 లక్షలు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 3337 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మార్చి 2న ఫలితాలు వెలువడనున్నాయి.
కాగా, విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న అధికార బీజేపీకి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షేనని, ఈసారి గట్టెక్కడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ-ఐపీఎఫ్టీ, లెఫ్ట్-కాంగ్రెస్ కూటములుగా ఏర్పడగా, రాజవంశానికి చెందిన తిప్ర మోత గట్టి పోటీదారుగా నిలిచారు. టీఎంసీ పోటీలో ఉన్నా దాని ప్రభావం నామమాత్రమే.
Polling underway for #TripuraElections2023; visuals from polling booths number 54 in Gomati pic.twitter.com/spyIAIPh35
— ANI (@ANI) February 16, 2023
రాష్ట్రంలో అధికార బీజేపీ 55 సీట్లలో పోటీలో ఉండగా, దాని మిత్రపక్షం ఐపీఎఫ్టీ కేవలం ఐదు సీట్లలో మాత్రమే బరిలో ఉంది. వామపక్ష కూటమిలో సీపీఎం 47 సీట్లలో, కాంగ్రెస్ 13 సీట్లలో పోటీపడుతున్నాయి. తిప్ర మోత 42 మంది అభ్యర్థులను రంగంలో ఉంచారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాలలో, స్వతంత్ర అభ్యర్థులు 42 మంది పోటీలో ఉన్నారు.