కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ముకుల్ రాయ్ నోరు జారారు. పశ్చిమ బెంగాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే తప్పకుండా విజయం సాధిస్తుందని ముకుల్ రాయ్ అన్నారు. త్రిపురలోనూ బీజేపీదే విజయం అని ఆయన వ్యాఖ్యానించారు. టీఎంసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ముకుల్ రాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అక్కడున్న పార్టీ నాయకులు, విలేకర్లు ఆశ్చర్యపోయారు. తన వ్యాఖ్యలను మళ్లీ సరి చేసుకున్నారు ముకుల్ రాయ్. ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్సే విజయం సాధిస్తుందన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణానగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ముకుల్ రాయ్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో చేరారు.
ముకుల్ రాయ్ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. బీజేపీ అధికార ప్రతినిధి శామిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. కృష్ణా నగర్ నార్త్ నియోజకవర్గం ఓటర్లను ముకుల్ రాయ్ మోసం చేశారని, అక్కడ ఆయన విశ్వసనీయతను కోల్పోయారని పేర్కొన్నారు. అయినప్పటికీ నిజం మాట్లాడారు అని భట్టాచార్య పేర్కొన్నారు. ముకుల్ రాయ్ను టీఎంసీ తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందన్నారు.
ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి 2018లో బయటకు వెళ్లి బీజేపీలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో రాయ్ బీజేపీ తరపున లోక్సభకు ఎన్నికై బెంగాల్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణానగర్ నార్త్ నుంచి గెలిచి టీఎంసీలో చేరారు.