ఎకనమిక్ సర్వే నిర్వహించకుండా, ముందస్తు సర్క్యులర్ జారీ చేయకుండా రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారు. తాజా పరిణామంతో పేదలైన గిరిజనులు, వృద్దులు, దివ్యాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
– వంసదా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనంత్ పటేల్
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 81.35 కోట్ల మంది పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నట్టు ఒకవైపు గొప్పగా ప్రకటించుకొంటున్న బీజేపీ ప్రభుత్వం మరోవైపు గిరిజనులపై ఉక్కుపాదం మోపుతున్నది. అక్రమంగా అదనపు కార్డులు ఉన్నాయన్న సాకుతో వేలాది కుటుంబాలకు ఇచ్చిన రేషన్ కార్డులను రద్దు చేస్తున్నది. ప్రధాని మోదీ స్పరాష్ట్రం గుజరాత్ సర్కారు తాజాగా తీసుకొన్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్లో నర్మదా, దంగ్, తపీ తదితర 11 జిల్లాల్లోని గిరిజనులు ఎక్కువగా నివాసం ఉండే 30 తాలుకాల్లో ఈ ఏరివేత ప్రక్రియకు కొనసాగుతున్నది.
తాజా నిర్ణయంతో 83,556 కుటుంబాల్లోని దాదాపు 5 లక్షల మంది తిండిగింజలకు దూరమయ్యే ప్రమాదమున్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఎకనమిక్ సర్వే నిర్వహించకముందే, అదనపు కార్డులు ఉన్నాయన్న సాకుతో రేషన్ కార్డులను ఎలా తొలగిస్తారని ధ్వజమెత్తారు. కాగా, ప్రభుత్వం రద్దు చేయాలనుకొన్న రేషన్ కార్డు లబ్ధిదారుల్లో ఎక్కువమంది గిరిజనులు, 11 జిల్లాలకు చెందినవారే ఉండటం విమర్శలకు తావిస్తున్నది.