Crime News | సెల్ఫీలపై మోజు ప్రాణాల మీదకు తెస్తున్నది. ఇద్దరు టీనేజీ యువకులు అలా సెల్ఫీల కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ జిల్లాలో ఇద్దరు యువకులు శనివారం సాయంత్రం రైల్వే వంతెనపై నిలబడి సెల్ఫీ దిగుతున్నప్పుడే దూసుకొచ్చిన రైలు ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిని రూర్కీ పట్టణ వాసులు సిద్ధార్థ్ సైనీ (19), శివం సైనీ (16) అని పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివం, సిద్ధార్థ్ తమ కుటుంబాలతో కలిసి.. లక్సర్ ప్రాంతంలోని సోలానీ నదీ తీరం వద్ద పూజల నిర్వహణకు వచ్చారు. అప్పుడే సమీపంలోని దోస్నీ రైల్వే వంతెన మీదకు చేరుకుని సెల్ఫీలు దిగుతున్నారు. అంతలోనే వేగంగా దూసుకొస్తున్న డెహడ్రూన్- ఢిల్లీ శతాబ్ధి ఎక్స్ ప్రెస్ రాకను వారు గుర్తించలేదు. దీంతో రైలు వారిని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు చెప్పారు.