Holidays | న్యూఢిల్లీ, డిసెంబర్ 25: వారంతం సెలవులకు అనుగుణంగా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు రావటంతో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలకు జనం పోటెత్తారు. వివిధ రాష్ర్టాల్లో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లమీదకు రావటంతో ట్రాఫిక్ కష్టాలు పర్యాటకుల ఆనందాన్ని ఆవిరిచేస్తున్నాయి. కర్ణాటకలో బెంగళూరు, మైసూర్, కొడగు వంటి పర్యాటక ప్రదేశాల్లో పండుగ సమయాన్ని గడిపేందుకు జనాలు పెద్ద సంఖ్యలో వాహనాల్లో తరలిరాగా, వారి ఆనందాన్ని ట్రాఫిక్ కష్టాలు నీరుగార్చాయి. బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా, పర్యాటకులు గంటలకొద్దీ అక్కడే గడపాల్సి వచ్చింది. కొడగు వద్ద రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పండుగ సెలవుల సమయంలో ట్రాఫిక్ ఉంటుందని తెలిసినా, ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని వాహనదారులు మండిపడ్డారు.
హిమాచల్లో డ్రోన్తో పర్యవేక్షణ
ఉత్తరాదిన మనాలి, కాసోల్, సిమ్లా సహా పలు ప్రదేశాల్లోనూ పర్యాటకులు నానా అవస్థలకు గురయ్యారు. సుందరమైన కొండ ప్రాంతాల్లో పండుగ సెలవుల్ని గడుపుదామని వచ్చిన పర్యాటకుల్ని అక్కడి ట్రాఫిక్ పరిస్థితి నిరాశపర్చింది. జాతీయ రహదారులపై టోల్ బూత్ల వద్ద గంటల కొద్దీ వాహనాల్ని నిలపలేక ఇబ్బందిపడ్డారు. లాహౌల్, స్పితి జిల్లాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని జిల్లా యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసింది. పర్యాటకుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ కోసం లాహౌల్, స్పితి జిల్లాల్లో పోలీసులు డ్రోన్ సహాయంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జాతీయ రహదారిపైన అటల్ టన్నెల్ నుంచి మనాలి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. కనీసం పార్కింగ్కు అవకాశం లేకుండా ఉందని పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.