అహ్మదాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి గొప్పలు చెబుతుంటారు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న యూపీ నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. తాజాగా గుజరాత్లో దారుణం జరిగింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అర్ధరాత్రి దోపిడీ దొంగలుగా మారారు. దంపతులను బెదిరించి డబ్బులు దోచుకున్నారు. న్యూస్ పేపర్ రిపోర్టుల ఆధారంగా ఘటనపై గుజరాత్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.
వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్కు చెందిన దంపతులు తమ ఏడాది కుమారుడితో కలిసి ఇటీవల థాయిలాండ్ పర్యటనకు వెళ్లారు. పర్యటన ముగించుకుని మంగళవారం అర్ధరాత్రి తిరిగి అహ్మదాబాద్కు చేరుకున్నారు. ఎయిర్పోర్టు నుంచి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తుండగా మార్గమధ్యలో ట్రాఫిక్ పోలీసులు వాళ్లను అడ్డగించారు.
ఓ కానిస్టేబుల్ మాట్లాడుదామంటూ భర్తను పోలీస్ వ్యాన్లోకి తీసుకెళ్లాడు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తనిఖీ పేరుతో క్యాబ్లోకి దూరి మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం బాధితులను విడిచిపెట్టేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు తన అకౌంట్లో కేవలం రూ.60 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో దంపతులిద్దరినీ స్థానికంగా ఉన్న ఓ ఏటీఎం కేంద్రం దగ్గరికి తీసుకెళ్లారు.
అక్కడ ఏటీఎం నుంచి రూ.60 వేలు డ్రా చేయించారు. ఆ తర్వాత డబ్బులు లాక్కుని విడిచిపెట్టారు. అదే సమయంలో తారసపడ్డ మీడియా ప్రతినిధులకు బాధితులు విషయం చెప్పారు. దాంతో తెల్లారి పేపర్లలో ఈ వార్త ప్రచురితమైంది. ఈ వార్తను సుమోటోగా స్వీకరించిన గుజరాత్ హైకోర్టు.. నిందితులపై తగిన చర్యలు తీసుకుని, ఆ చర్యలకు సంబంధించిన రిపోర్టును సెప్టెంబర్ 11 కల్లా అఫిడవిట్తో కలిపి సబ్మిట్ చేయాలని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది.