JN.1 | దేశంలో కరోనా సబ్వేరియంట్ జేఎన్.1 (JN.1) కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం వరకూ 682 ఉన్న కేసులు.. సోమవారం నాటికి 800 దాటాయి. తాజాగా దేశంలో 137 జేఎన్.1 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి జనవరి 8వ తేదీ వరకూ దేశంలో జేఎన్.1 కేసులు 819కి పెరిగినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. మొత్తం 12 రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూసినట్లు తెలిపాయి.
అత్యధికంగా మహారాష్ట్రలో డబుల్ సెంచురీ దాటాయి. అక్కడ 250 జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్ణాటకలో 199 కేసులు, కేరళలో 148, గోవాలో 49, గుజరాత్లో 36, ఆంధప్రదేశ్లో 30, రాజస్థాన్లో 30, తమిళనాడులో 26, ఢిల్లీలో 21, ఒడిశాలో మూడు కేసులు వెలుగుచూశాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కేసులు మాత్రమే ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 26కి పెరిగింది.
A total of 819 cases of JN.1 series variant have been reported from 12 states in India till 8th January 2024: Sources
— ANI (@ANI) January 9, 2024
మరోవైపు BA 2.86 రకానికి చెందిన ఈ జేఎన్.1 ఉపరకాన్ని ప్రత్యేకమైన ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించిన విషయం తెలిసిందే. దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. ముప్పు తక్కువేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో ఈ రకం కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అసవరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా దేశంలో కొవిడ్ వ్యాప్తి కూడా కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 475 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించింది. అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు వెలుగుచూసినట్లు పేర్కొంది. మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు బయటపడినట్లు తెలిపింది. మరోవైపు దేశంలో క్రియాశీల కేసులు 4వేల దిగువకు పడిపోయాయి. ప్రస్తుతం దేశంలో 3,919 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజే ఆరు మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో ముగ్గురు, చత్తీస్గఢ్లో ఇద్దరు, అస్సాంలో ఒకరు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
Also Read..
Rats In IRCTC Stall | ఐఆర్సీటీసీ స్టాల్లో ఎలుకలు స్వైరవిహారం.. ఫుడ్ను టేస్ట్ చేస్తూ.. VIDEO
Yash | పుట్టినరోజంటేనే భయమేస్తోంది.. అభిమానుల మృతిపై యశ్ ఆవేదన
White House | అమెరికా అధ్యక్ష భవనం గేటుపైకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి అరెస్ట్