హైదరాబాద్: దేశంలో కరోనా విస్తృతి అంతకంతకే పెరిగిపోతున్నది. రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా ఎక్కువవుతున్నది. మహారాష్ట్ర, ఢిల్లీల్లో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. కానీ, ఇవాళ కేరళలో భారీగా ఒమిక్రాన్ ( Omicron ) కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే ఏకంగా 44 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడింది. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 107కు చేరింది. ఈ వివరాలను కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జి వెల్లడించారు.
కాగా, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపుతున్నామని వీణాజార్జి చెప్పారు. కరోనా కట్టడి కోసం నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నదన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 98 శాతం మందికి తొలిడోస్, 79 శాతం మంది రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు.