ప్రేమ, శాంతి, అహింస ద్వారా విముక్తి సాధించవచ్చని గాంధీకి టాల్స్టాయ్ ఉద్భోధించారు. రాజకీయ పోరాటాలకు కొత్త మార్గం చూపిన గాంధీకి ఓ లేఖ ఓనమాలు నేర్పింది. తన భవిష్యత్నే కాదు ప్రపంచాన్నే మార్చేసింది.
భారతదేశానికి స్వాతంత్య్రం కోసం రష్యన్ రచయిత, తాత్వికుడైన లియో టాల్స్టాయ్ మద్దతు కోరుతూ విప్లవవాది తారక్నాథ్ దాస్ రెండు లేఖలు రాశాడు. ఆ లేఖలకు ప్రతి స్పందనగా 14 డిసెంబర్ 1908న టాల్స్టాయ్ ఓ లేఖ రాశాడు. ఆ లేఖ ‘ఎ లెటర్ టు ఎ హిందూ’గా ప్రసిద్ధిగాంచింది. ఈ లేఖ యువకుడైన మోహన్దాస్ గాంధీని ఆకట్టుకుంది.
ఆ లేఖకు గుజరాతీ అనువాదాన్ని ప్రచురించాలని గాంధీ కోరిక. తాను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు నిర్వహిస్తున్న వార్తా పత్రిక ఇండియన్ ఒపీనియన్లో ముద్రించడానికి అనుమతి కోసం గాంధీ టాల్స్టాయ్కి లేఖ రాశాడు. టాల్స్టాయ్ రాసిన లేఖను ఆంగ్లం నుంచి గుజరాతీలోకి అనువదించాడు.
అప్పటి నుంచి 1910లో టాల్స్టాయ్ చనిపోయే వరకూ ఆయనతో గాంధీకి ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తూనే ఉన్నాయి. ప్రేమ ద్వారానే భారతీయులు బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొందగలరని సూచించాడు.
టాల్స్టాయ్ తాత్విక ఆలోచనలు గాంధీపై బలమైన ముద్ర వేశాయి. తర్వాత కాలంలో ఆయన తనను తాను రూపొందించుకోవడానికి, స్వాతంత్య్రోద్యమ నిర్వహణకు తోడ్పడ్డాయి. టాల్స్టాయ్ లేఖ గాంధీజీకి తమిళ సాహిత్యంలోని తిరుక్కురల్ను పరిచయం చేసింది. టాల్స్టాయ్ చెప్పినట్లుగానే సత్యం, ప్రేమ, అహింసా మార్గంలో భారత స్వాతంత్య్ర పోరాటం విజయవంతం కావడం చరిత్ర.