న్యూఢిల్లీ : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయంలో భారీ వృద్ధిని ఆశిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో ఈ ఆదాయం ఏటా రూ.40వేల కోట్ల నుంచి రూ.1.40లక్షల కోట్లకు పెరుగనున్నదన్నారు. ఓ కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ట్రాఫిక్ పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటే.. భారతదేశంలో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడిదారులకు భారీ అవకాశం ఉంటుందన్నారు. ఈ రంగంలో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం నిరంతరం పెరుగుతోందన్న పెరుగుతోందన్నారు.
అదే సమయంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై రాబడి రేటు కూడా పెరుగుతోందన్నారు. ఈ క్రమంలో పెట్టుబడిదారులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నారు. ఏజెన్సీ నిర్ణయాల్లో జాప్యం కారణంగా పెరుగుతున్న ఖర్చులు, రహదారుల మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులపై మూడు నెలల్లోగా సమన్వయ కమిటీలు నిర్ణయం తీసుకోవాలని గడ్కరీ సూచించారు. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వల్ల ప్రాజెక్టుల వ్యయం పెరుగుతోందన్నారు. క్లెయిమ్ల వేగవంతం, పరిష్కారం కోసం ఎన్హెచ్ఏఐ ముగ్గురు సభ్యుల స్వతంత్ర నిపుణులతో కూడిన మూడు కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు.