కోట్లాది మంది భారతీయులకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఇప్పటికీ ఆదర్శవంతంగానే నిలుస్తున్నారని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ఈ కాలానికి కూడా ఆమెను ఎంతో గర్వంగా స్మరించుకుంటూనే ఉంటామని అన్నారు. బంగ్లాదేశ్ విముక్త వారోత్సవాల కార్యక్రమంలో సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ధీశాలిత్వం, ప్రతికూల పరిస్థితులకు కూడా తట్టుకొని నిలబడే గుణానికి ఆమె ప్రతీక అని కొనియాడారు. 1971 సంవత్సరం చాలా రకాలుగా ఇందిరకు అద్భుతమైన సంవత్సరమని వ్యాఖ్యానించారు. బంగ్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రపంచం మొత్తానికి ఓ అవగాహన కల్పించిన ఘనత ఆమెదేనని సోనియా పేర్కొన్నారు. 50 ఏళ్ల క్రితం బంగ్లా ప్రజలు తమకి తాము ఓ కొత్త భవిష్యత్తులోకి అడుగు పెట్టారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో కోటి మంది బంగ్లా శరణార్థులకు భారత్ బాసటగా నిలిచి, ఇళ్లను కట్టించిందని సోనియా గాంధీ అన్నారు.