న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ రక్షణ దళాల దూకుడును అడ్డుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా సహాయాన్ని పాకిస్థాన్ కోరింది. దీని కోసం ఆ దేశం తీవ్రంగా ల్యాబీయింగ్(Pakistan Lobbying) చేసినట్లు తాజా ఆధారాలు బయటపడ్డాయి. వాషింగ్టన్లో అమెరికా పెద్దలను కలిసేందుకు పాకిస్థాన్ తీవ్ర ప్రయత్నం చేసింది. దౌత్యపరమైన రీతిలో అమెరికా సహాయాన్ని కోరింది. పాకిస్థానీ దౌత్యవేత్తలు, రక్షణ దళ అధికారులు ఇండియాను శాంతింపచేయడానికి అమెరికా హెల్ప్ కోరారు. సుమారు 50 సార్లు మీటింగ్లు నిర్వహించినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ చేపట్టే విధంగా పాకిస్థాన్ అధికారులు అమెరికాను వేడుకున్నట్లు ఓ ఆంగ్ల మీడియా కథనాన్ని రాసింది. దానికి సంబంధించిన డాక్క్యూమెంట్లను కూడా ఆ కథనంలో సమీక్షించారు. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతీయ సైనిక దళాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే.
అమెరికా ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్టులో దాఖలైన రికార్డుల ఆధారంగా పాకిస్తాన్ అధికారులు సుమారు 60 సార్లు అమెరికా అధికారులతో భేటీ అయినట్లు తెలుస్తున్నది. పాకిస్థాన్ అంబాసిడర్తో పాటు రక్షణాధికారులు ఈ-మెయిల్, ఫోన్లు, వ్యక్తిగతంగా అమెరికా అధికారులను కలిసినట్లు తెలుస్తోంది. భారత్ తన దాడిని ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని అమెరికాను పాక్ కోరినట్లు ఆ డాక్యుమెంట్లతో తెలిసింది. అమెరికా ఉభయసభలు, పెంటగాన్, జర్నలిస్టులను పాక్ అధికారులు కలిశారు. కశ్మీర్, ప్రాంతీయ భద్రత, అరుదైన ఖనిజాలు, ద్వైపాక్షిక బంధాలు,మీడియా సంస్థలతో పాక్ చర్చించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో లాబీయింగ్ కోసం పాకిస్థాన్ ఎక్కువగా ఖర్చు చేసినట్లు తెలిసింది. ఆరు లాబీయింగ్ సంస్థలతో పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మీడియా కథనంలో రాశారు. సీడెన్ లా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్మార్షల్ అసిమ్ మునీర్తో ట్రంప్ భేటీ అయినట్లు తెలుస్తోంది.
తాము వాణిజ్య బెదిరింపులకు పాల్పడితేనే ఆపరేషన్ సింధూర్ను ఇండియా ఆపినట్లు ట్రంప్ పలుమార్లు చెప్పారు.