న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ శుక్రవారం ఢిల్లీలో కలిశారు. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ (INDIA Bloc) తదుపరి ప్రణాళికపై వీరు చర్చించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1న ‘ఇండియా’ కూటమి రెండో సమావేశం జరిగింది. అనంతరం నెలకుపైగా ప్రతిపక్షాల కూటమికి సంబంధించి ఎలాంటి సమావేశాలు జరుగలేదు. ఈ నేపథ్యంలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, శరద్ పవార్ కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ ముగ్గురు నేతలు సుమారు 40 నిమిషాలపాటు పలు అంశాలపై చర్చించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, త్వరలో జరుగనున్న రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, బీజేపీని ఎదుర్కోవడం, ‘ఇండియా’ బ్లాక్ తదుపరి కార్యాచరణ, సమావేశాల గురించి ఈ సందర్భంగా వారు మాట్లాడుకున్నట్టు తెలిసింది.
కాగా, శరద్ పవార్తో కలిసి భేటీ అయిన విషయాన్ని మల్లిఖార్జున్ ఖర్గే నిర్ధారించారు. దేశ ప్రజల గొంతును మరింత పెంచడానికి రాహుల్ గాంధీతో కలిసి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ను కలిసినట్లు ఎక్స్లో పేర్కొన్నారు. ముగ్గురు నేతలు సమావేశమైన ఫొటోలను షేర్ చేశారు. ‘ప్రతి సవాల్కు మేం సిద్ధంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. అలాగే ‘భారతదేశం ఏకం అవుతుంది, భారతదేశం గెలుస్తుంది’ అన్న ‘ఇండియా’ బ్లాక్ ట్యాగ్లైన్ను పునరుద్ఘాటించారు.
देश की जनता की आवाज़ और बुलंद करने के लिये आज, श्री @RahulGandhi जी के साथ, NCP अध्यक्ष श्री @PawarSpeaks जी से भेंट हुई।
हम हर चुनौती के लिए तैयार हैं।
जुड़ेगा भारत, जीतेगा INDIA 🇮🇳 pic.twitter.com/5EXuKSU6zL
— Mallikarjun Kharge (@kharge) October 6, 2023