Supreme Court | న్యూఢిల్లీ, మార్చి 21: క్రిమినల్ కేసు విషయంలో తాము స్టే ఇచ్చినప్పటికీ తమిళనాడు మంత్రివర్గంలోకి పొన్ముడిని తిరిగి నియమించకపోవడంపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ రవి తన చర్యల ద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలనే ధిక్కరిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. ఒక నేరాభియోగంపై కోర్టు స్టే విధించినప్పుడు దానితో గవర్నర్కు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. ‘రేపటి వరకు గవర్నర్కు గడువు ఇస్తున్నాం.
మా తీర్పు అమలు కాకపోతే ఏం చేస్తామో ఇప్పుడు చెప్పం’ అని సీజేఐ అటార్నీ జనరల్తో అన్నారు. తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పొన్ముడిని తిరిగి మంత్రిగా నియమించేలా గవర్నర్కు మార్గదర్శకాలు జారీ చేయాలని సీఎం స్టాలిన్ పిటిషన్లో కోరారు. పొన్ముడికి సంబంధించి ఆదాయానికి మించి ఆస్తుల కేసుపై మార్చి 11న సుప్రీంకోర్టు స్టే విధించింది. మూడేండ్ల జైలు శిక్ష నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది. ‘మనం చట్టబద్ధ పాలనలో ఉన్నామా? ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు ఇలా ఎలా చేస్తారు? మా ఆదేశం అమలు చేయాల్సిందే. గవర్నర్.. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసే రాజ్యాంగబద్ధ అధిపతి మాత్రమే. ఆయనకు కేవలం సలహాలిచ్చే అధికారం మాత్రమే ఉంది. అంతే’ అని సీజేఐ అన్నారు.