న్యూఢిల్లీ : మోదీ, షా స్వరాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్న కాషాయ పార్టీ చవకబారు ప్రచార వ్యూహాలతో దిగజారుతోంది. ఎన్నికల్లో లబ్ధి కోసం నిబంధనలకు పాతరేసి విదేశీయులతో ప్రచారం సాగిస్తున్న తీరు వెగటు పుట్టిస్తున్నది. ఆ పార్టీ అధికారిక ట్విట్టర్లో విదేశీయులు ప్రచారంలో పాల్గొన్న వీడియోపై పెను దుమారం రేగుతోంది. దేశీ ఎన్నికల్లో విదేశీయులు ఓ రాజకీయ పార్టీ కండువాతో ప్రచారం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకుని తీవ్ర చర్యలు చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
గుజరాత్లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రచారం చేస్తూ కనిపించిన విదేశీయులపై చర్యలు చేపట్టాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రతినిధి సాకేత్ గోఖలే ఈసీని కోరారు. బీజేపీ, గుజరాత్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేసిన వీడియోలో ఈ వ్యవహారం వెలుగుచూసిందని ఈసీకి రాసిన లేఖలో గోఖలే పేర్కొన్నారు. పార్టీ కండువాలు ధరించిన కొందరు విదేశీయులు బీజేపీ తరపున ప్రచారం చేపట్టారని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు.
ఇది భారత ఎన్నికల్లో విదేశీ జోక్యం కిందకు వస్తుందని, ఈ చర్య ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశారు. భారత వీసా నిబంధనలకూ విరుద్ధమని పేర్కొన్నారు. గుజరాత్ బీజేపీ షేర్ చేసిన వీడియోలో కొందరు విదేశీ సంతతికి చెందిన వారు కాషాయ పార్టీ తరపున ప్రచారం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పనితీరును ప్రశంసించడం కనిపించింది. బీజేపీ ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తోందని టీఎంసీ నేత మండిపడ్డారు. రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేసిన విదేశీయులపై సంబంధిత చట్టాలకు అనుగుణంగా తక్షణమే చర్యలు చేపట్టాలని ఈసీకి రాసిన లేఖలో గోఖలే డిమాండ్ చేశారు.