కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లా ధూప్గురి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పాలక టీఎంసీ (TMC) విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి నిర్మల్ చంద్ర రాయ్ 4000 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్ధిపై గెలుపొందారు. టీఎంసీ అభ్యర్ధికి 96,961 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్ధి తపసీ రాయ్ 92,648 ఓట్లు వచ్చాయి.
సీపీఎం అభ్యర్ధి ఈశ్వర చంద్ర రాయ్ 13,666 ఓట్లు రాబట్టి మూడో స్ధానంలో నిలిచారు. టీఎంసీ అభ్యర్ధి గెలుపుపై సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ తమ పార్టీ పట్ల విశ్వాసం ఉంచిన ఓటర్లకు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ధూప్గురి ప్రజలు తమపై విశ్వాసం కనబరిచారని, తమ వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సాధికారతకు చేస్తున్న కృషికి పట్టం కట్టారని అన్నారు.
బెంగాల్ తన తీర్పును వెల్లడించిందని, త్వరలోనే ఇండియా సైతం తన స్ఫూర్తి, ప్రాధాన్యతలను చాటుతుందని, జై బంగ్లా, జై ఇండియా! అని దీదీ రాసుకొచ్చారు. ధూప్గురి సీటును బీజేపీ నుంచి టీఎంసీ గెలుచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ నియోజకవర్గానికి బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిష్ణు పద రాయ్ ఈ ఏడాది జులైలో మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది.
Read More :
Aadhar Update | ఆధార్ అప్డేట్ గడువు పొడిగించిన UIDAI.. అప్పటి వరకు ఉచితమే..!