కోల్కతా, మే 30: బెంగాల్కు రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయకపోవడంపై వివరణివ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 5,6 తేదీల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లా దుర్గాపూర్లో మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం గలీజు రాజకీయ నాటకం ఆడుతున్నదని, నిరుపేదలకు చెల్లించాల్సిన ఉపాధికూలీ వేతనాల సొమ్ము విడుదల చేయడం లేదని దుయ్యబట్టారు.
ఈ పథకం కింద ఇవ్వాల్సిన రూ.6,000 కోట్లు తొక్కిపెట్టిందని మండిపడ్డారు. కేంద్రాన్ని తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, రాష్ర్టానికి కేటాయించిన నిధులను విడుదల చేయాలని మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. బంగ్లా ఆవాస్ యోజన నిధులను సైతం కేంద్రం విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. వివిధ పథకాల కింద సుమారు రూ.96 వేల కోట్లు కేంద్రం నుంచి బెంగాల్కు రావాల్సి ఉన్నదని వివరించారు.