న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: తృణమూల్ కాంగ్రెస్కు బలమైన మద్దతుదారు, భూకబ్జాదారుడు, సందేశ్ఖాలిలో లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ను గురువారం ఉదయం పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాజహాన్ గత 55 రోజులుగా పరారీలో ఉన్నాడు. సందేశ్ఖాలికి 30 కిలోమీటర్ల దూరంలోని మినాఖాన్ పోలీస్స్టేషన్ పరిధిలోని బమన్పుకూర్లోని ఓ ఇంటి నుంచి షాజహాన్ షేక్ను అరెస్ట్ చేసినట్టు బెంగాల్ డీజీపీ సుప్రతిమ్ సర్కార్ వెల్లడించారు.
తన అనుచరులతో కలిసి షేక్ ఆ ఇంట్లో దాక్కున్నట్టు పోలీసులు తెలిపారు. అతడిని అరెస్ట్ చేసి బసిర్హాట్ కోర్టుకు తరలించారు. కోర్టు షేక్కు 10 రోజుల రిమాండ్ విధించింది. సీఐడీ విచారణ కోసం పోలీసులు అతడిని కోల్కతాలోని భబానీ భవన్కు తరలించారు. షాజహాన్ షేక్ను పోలీసులు అరెస్ట్ చేశారన్న సమాచారం బయటకు రాగానే సందేశ్ఖాలి వాసులు సంతోషం వ్యక్తం చేశారు.
షాజహాన్ షేక్ అరెస్టు అయిన కొన్ని గంటలకే అతడిని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు అధికార టీఎంసీ ప్రకటించింది. షాజహాన్ షేక్ నార్త్ 24 పరగణాల జిల్లా పరిషత్లో టీఎంసీ ప్రతినిధిగా ఉన్నాడు. సందేశ్ఖాలి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కన్వీనర్గా కూడా వ్యవహరిస్తున్నాడు.
రేషన్ కుంభకోణం కేసులో జనవరి 5న ఈడీ అధికారులపై దాడికి సంబంధించి నజత్ పోలీస్ స్టేషన్లో నమోదైన రెండు కేసుల్లో షేక్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే షేక్ అరెస్ట్పై విపక్షాలు స్పందన మరోలా ఉన్నది. ఇతంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ కొట్టిపారేస్తున్నాయి.
పలు ఆరోపణల కింద గురువారం అరెస్ట్ అయిన షాజహాన్ షేక్కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అతని తరుఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై కలకత్తా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆయనపై ఎలాంటి సానుభూతి లేదని స్పష్టం చేసింది. గురువారం షాజహాన్ బెయిల్ పిటిషన్ను హైకోర్టు విచారించింది. తన క్లయింట్ ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైందని, రాత్రి అతడిని అరెస్ట్ చేశారని న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి శివజ్ఞానం మాట్లాడుతూ ఈ వ్యక్తిపై 43 కేసులున్నాయి. తీవ్ర నేరారోపణలెదుర్కొంటున్న నిందితుడిపై ఎలాంటి సానుభూతి లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించటం గమనార్హం.