న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్కు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సన్నాహాలు చేపట్టింది. ఈనెల 25న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హస్తిన పర్యటనతో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు కసరత్తు సాగిస్తారని టీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ సందర్భంగా విపక్షాలను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చే ప్రయత్నాలకు శ్రీకారం చుడతారని ఆ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీని మట్టికరిపించేందుకు విపక్షాలు కలిసికట్టుగా పోరాడాలని దీదీ ఇప్పటికే పిలుపు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలను కలుపుకునిపోయేందుకు సహకారం, సమన్వయం సాధించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని టీఎంసీ ప్రతినిధి ఓం ప్రకాష్ మిశ్రా పేర్కొన్నారు. కాగా తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండు మూడు రోజులు అక్కడే ఉంటానని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్లతో సమావేశమవుతానని దీదీ పేర్కొన్నారు. హస్తిన టూర్లో భాగంగా మమతా బెనర్జీ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సహా పలువురు విపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతారని టీఎంసీ వర్గాలు వెల్లడించాయి.