న్యూఢిల్లీ, డిసెంబర్ 25: పార్లమెంట్ ప్రాంగణంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హావభావాలను అనుకరించడంపై(మిమిక్రీ) వివాదం రేగినా టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వెనక్కు తగ్గలేదు. పశ్చిమబెంగాల్లోని శ్రీరామ్పూర్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో బెనర్జీ మరోసారి ధన్కర్ను అనుకరించడం వివాదంగా మారింది. ‘నేను ఈ విధమైన మిమిక్రీ చేస్తూనే ఉంటాను. ఇది ఒక కళ. అవసరమైతే వెయ్యి సార్లు అయినా చేస్తాను. నా అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు నాకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. నన్ను జైల్లో పెట్టినా.. వెనకడుగు వేసేది లేదు’ అని చెప్పారు. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. సీఎం మమతా బెనర్జీ దన్ను చూసుకొని టీఎంసీ పార్టీలో అహకారం తారాస్థాయిలో ఉన్నదని విమర్శించారు. వారు రాజ్యాంగబద్ధమైన పదవిని హేళన చేసినా, రైతు కొడుకుని అవహేళన చేసినా, వెనుకబడిన కులాలకు చెందిన వారిని ఎగతాళి చేసినా జైలుకు వెళ్లరు, కానీ ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు.