న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ చిహ్నాన్ని అవమానించారని టీఎంసీ ఎంపీలు జవహర్ సిర్కార్, మహువ మొయిత్రా ఆరోపించారు. నూతన పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నంలో సింహాన్ని దుందుడుకుగా అసందర్భంగా చూపుతూ ఈ చిహ్నాన్ని అపహాస్యం చేశారని మోదీపై వారు మండిపడ్డారు.
గాంభీర్యంగా, నిబ్బరంగా కనిపించే సింహాన్ని నూతన పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన మోదీ వెర్షన్ చిహ్నంలో గర్జించే, దుందుడుకుగా కనిపిస్తున్న సింహాన్ని ఉంచారని రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ ట్వీట్ చేశారు. ఇది మన జాతీయ చిహ్నాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. ఇది సిగ్గుచేటని తక్షణమే ఈ చిహ్నాన్ని మార్చాలని డిమాండ్ చేశారు.
ఇక గత జాతీయ చిహ్నం, ప్రస్తుత చిహ్నాన్ని పక్కపక్కన ఉంచిన ఇమేజ్ను లోక్సభ ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ప్రధాని ఆవిష్కరించడాన్ని సీపీఎం, కాంగ్రెస్, ఎంఐఎంలు తప్పుపట్టాయి. శాసనవ్యవస్ధ, కార్యనిర్వాహక వ్యవస్ధ మధ్య అధికారాలపై రాజ్యాంగంలో విస్పష్ట విభజన ఉందని, ప్రధాని మోదీ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. అయితే విపక్షాలు రాజకీయ దురుద్దేశంతోనే విమర్శలు గుప్పిస్తున్నాయని బీజేపీ తోసిపుచ్చింది.