కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ నేత (TMC) అహ్మద్ అలి బిశ్వాస్ను శుక్రవారం ఉదయం కాల్చిచంపారు. అహ్మద్ హంక్షాలి బ్లాక్లోని కూరగాయల మార్కెట్కు వెళుతుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. దుండగులతో మృతుడు కొద్దిసేపు వాగ్వాదానికి దిగాడని, ఆపై కొద్ది నిమిషాలకే దుండగుల్లో ఓ వ్యక్తి అతడిపై తుపాకీతో కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
ఈ ఘటనలో టీఎంసీ నేత అహ్మద్ అలీ బిశ్వాస్ అక్కడికక్కడే మరణించారు. స్ధానికులు తృణమూల్ నేతను బగులా గ్రామీణ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ముమ్మరం చేశారు.
వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిఉంటుందని టీఎంసీ జిల్లా అధ్యక్షుడు దేవాశిష్ గంగూలీ అన్నారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూస్తాయని అన్నారు. ఇక ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నామని త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
Read More