కోల్కతా : బంగ్లాదేశ్లో దుర్గా పూజ సందర్భంగా హిందువులపై ఇటీవల జరిగిన దాడులు ముందస్తు కుట్రలో భాగమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం దాల్చారని నిలదీసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ బంగ్లాదేశ్ పర్యటన వెనుక ఉద్దేశమేంటని పార్టీ పత్రిక జాబో బంగ్లాలో ప్రశ్నించింది. బంగ్లాదేశ్లో ఇటీవలి పరిణామాలను బెంగాల్లో హిందూ సెంటిమెంట్స్ను రెచ్చగొట్టేందుకు వాడుకోవాలని ప్రధాని ప్రయత్నిస్తున్నారా అని సందేహం వ్యక్తం చేసింది.
బంగ్లాదేశ్లో హిందువుల అణిచివేతను చూపి బెంగాల్లో మీరు హిందువుల మనోభావాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారా అని ప్రశ్నించింది. బంగ్లా ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని తాము డిమాండ్ చేస్తున్నామని టీఎంసీ పేర్కొంది. దుర్గా పూజ సందర్భంగా బంగ్లాలో హిందువులపై జరిగిన దాడులు గర్హనీయమని, ఇవి ముందస్తు కుట్రలో భాగమేనని దుయ్యబట్టింది. ఈ కుట్ర వెనుక ఎవరున్నారనేది నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది.