తిరుమల: రెండు రోజుల క్రితం తిరుమల మెట్లమార్గంలో చిన్నారి లక్షితపై (Lakshitha) దాడి చేసి చంపిన చిరుత (Leopard) చిక్కింది. బాలిక మరణించిన ప్రదేశానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుతపులి దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దదిగా అటవీ అధికారులు గుర్తించారు. బాలిక మృతిచెందిన ప్రదేశంతోపాటు చుట్టుపక్కల మూడు బోన్లతోపాటు సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమల-అలిపిరి (Alipiri) కాలినడక మార్గంలోని (Step way) ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కిందని అధికారులు తెలిపారు.
శుక్రవారం రాత్రి నెల్లూలు జిల్లాకు చెందిన లక్షిత అనే ఆరేండ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమపంలో బాలికపై చిరుత దాడి చేసి ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. గతంలోనూ ఓ చిన్నారిపై దాడిచేసిన చిరుతను బంధించి కల్యాణ్ ట్యాంకు సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
కాగా, చిరుతను తిరుపతి ఎస్వీ జూపార్క్కు (SV Zoo Park) తరలిస్తామని టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి (EO Dharma reddy) చెప్పారు. బోనులో చిక్కే క్రమంలో అది స్వల్పంగా గాయపడిందని, ఎస్వీ జూపార్కులో చికిత్స అందిస్తామన్నారు. అనంతరం అది మ్యాన్ ఈటర్ అవునా కాదా అనేదానిపై పరీక్షలు చేస్తామని తెలిపారు. కాగా, పట్టుబడిన చిరుతను ఎక్కడ వదలాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.