న్యూఢిల్లీ: రాజద్రోహం కేసుల విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాజద్రోహానికి సంబంధించి పరిమితులను కోర్టులు నిర్వచించాల్సిన సమయం వచ్చిందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రెండు న్యూస్ చానెళ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ విచారణ జరిపారు. ఆ రెండు చానెళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. చానెళ్లపై రాజద్రోహం కేసులు పెట్టడం అనేది చాలా తీవ్రమైనది. అసలు రాజద్రోహం ఏంటో కోర్టులు చెప్పాల్సిన సమయం వచ్చింది అని చంద్రచూడ్ అన్నారు.
ఏపీ అధికార పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను చూపించినందుకు ఈ రెండు చానెళ్లపై రాజద్రోహం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కొవిడ్ సంబంధిత అంశాల విషయంలో మీడియాపై నియంత్రణ విధించకూడదన్న ఇటీవలి సుప్రీంకోర్టు ఆదేశాలను చూపుతూ.. ఈ రెండు చానెళ్లు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. తమ రెండు చానెళ్లే కాకుండా మరికొన్ని కూడా ఆయన వ్యాఖ్యలను ప్రసారం చేశాయని వాదించాయి.