న్యూఢిల్లీ, జనవరి 25 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. గణతంత్ర వేడుకలకు బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులతో పాటు ఈసారి ఆధునిక నిఘా సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఏఐ ఆధారిత గాగుల్స్తో పాటు వేలాది సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఆదివారం అధికారులు తెలిపారు.
వేడుకల్లో పాల్గొనే అతిథులతో పాటు వీక్షకుల భద్రతకు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టామని అడిషనల్ పోలీస్ కమిషనర్ దేవేశ్ కుమార్ మహలా తెలిపారు. నగరంలో పలుచోట్ల పికెట్లు, బ్యారికేడ్ల ఏర్పాటుతో పాటు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు అమలు చేస్తున్నామన్నారు. 3 వేల సీసీటీవీ కెమెరాలను వీడియో అనలిటిక్స్, ముఖ గుర్తింపు వ్యవస్థలతో అనుసంధానం చేశామన్నారు. 30కి పైగా కంట్రోల్రూమ్ల్లో 150 మందికి పైగా సిబ్బంది నిరంతరం నిఘా వేస్తారని చెప్పారు.