New Delhi : దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో విషాదం జరిగింది. ఒక పరిశ్రమలో విష వాయువులు పీల్చి ముగ్గురు కార్మికులు మరణించారు. ఈ ఘటన ఢిల్లీలోని ముండ్కా పారిశ్రామిక ప్రాంతంలోని, ఫ్యాక్టరీ నెంబర్ 93/8లో శుక్రవారం జరిగింది. పోలీసులు, అధికారులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం పరిశ్రమలోని ఒక సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేసేందుకు ఒక కార్మికుడు లోపలికి దిగాడు. అక్కడ విష వాయువు పీల్చడం వల్ల కొద్దిసేపటికే అతడు స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతడిని కాపాడేందుకు మరో ఇద్దరు కార్మికులు కూడా ఒకరి తర్వాత మరొకరు లోపలికి దిగారు.
కానీ, వాళ్లు కూడా అదే విషవాయువు పీల్చి స్పృహ తప్పి ట్యాంక్లోపలే పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఇతర కార్మికులు ఫైర్, పోలీస్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది లోపలికి దిగి ముగ్గురిని బయటకు తీశారు. అనంతరం వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఆలోపే ముగ్గురు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతులను అరుణ్ (38), సందీప్ (32), చంద్ (42)గా గుర్తించారు. ముగ్గురూ ఔటర్ ఢిల్లీలోని సుల్తాన్పురి పరిధి, ఇంద్ర జీల్ ఏరియాకు చెందిన వారుగా గుర్తించారు. ముగ్గురి మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై ముండ్కా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు గల కచ్చితమైన కారణాలపై ఆరా తీస్తున్నారు.
అలాగే, ప్రమాద స్థలంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే విషయాలపై కూడా అధికారులు తనిఖీ నిర్వహించనున్నారు. అయితే, పారిశ్రామిక ప్రాంతాల్లోని సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీటి నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ వంటి విష వాయువులు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే,వ వీటి నుంచి బయటపడే భద్రతా మార్గాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. సరైన ప్రమాణాలు పాటిస్తే ఈ విష వాయువుల నుంచి రక్షించుకోవచ్చని చెబుతున్నారు.