ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై హోం శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ చర్చిస్తుందని ఉదయం తెలిపిన కేంద్రం.. సాయంత్రానికి పిల్లిమొగ్గలు వేసింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం మాట మార్చింది. ప్రత్యేక హోదా అంశం ఎజెండాలో 8 వ అంశంగా పేర్కొన్నప్పటికీ.. సాయంత్రానికి విడుదల చేసిన మీటింగ్ నోటీస్లో మాత్రం ఈ అంశాన్ని తప్పించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై అధికారిక సమాచారం వచ్చిన గంటల వ్యవధిలోనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. అదంతా నిజం కాదని ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశమని, దీనికి హోంశాఖ కమిటీకి ఎలాంటి సంబంధం లేదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ అన్నారు. ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా అంశాన్ని ఈ త్రిసభ్య కమిటీలో చర్చించే అవకాశం లేదని చెప్పారు. ఉదయం అజెండాలో ప్రత్యేక హోదా అంశం ఉండటంపై తాను హోంశాఖ అదికారులతో మాట్లాడానని, వారు అజెండాలో ఈ అంశం లేదని స్పష్టం చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, విభజన సమస్యలను పరిష్కరించేందుకే త్రిసభ్య కమిటీని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నియమించిందన్నారు. అలాగే రిసోర్స్ గ్యాప్పై కూడా ఈ కమిటీ చర్చించదని తెలిపారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని జీవీఎల్ చెప్పారు. ప్రత్యేక హోదాపై చర్చ వంటి గందరగోళానికి అవకాశం ఇవ్వవద్దని ఆయన వ్యాఖ్యానించారు.