కుల్గాం: జమ్ముకశ్మీర్లో ఉద్రిక్తత నెలకొంది. ఉగ్రవాదుల కాల్పుల్లో శుక్రవారం ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. దీంతో జమ్ముకశ్మీర్ అంతటా హై అలర్ట్ కొనసాగుతున్నది. ఉగ్రవాదుల కోసం ఆర్మీ జల్లెడ పడుతున్నది. దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉన్న హలన్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులతో కలిసి ఆర్మీ కార్డన్ సెర్చ్ను నిర్వహించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతిచెందారు.
కుండ్లోనూ గాలింపు
ఉగ్రవాదుల జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. శుక్రవారం రాత్రంతా ఆపరేషన్ కొనసాగింది. వారి జాడ లభించకపోవడంతో శనివారం కూడా ఆపరేషన్ను కొనసాగించారు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు పాలుపంచుకున్నారని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాదులు ఇటీవల పీర్ పంజల్ శ్రేణిలోకి ప్రవేశించినట్టు అనుమానిస్తున్నారు. ఇదే జిల్లాలోని కుండ్ ప్రాంతం వైపు ఆర్మీ వాహనాలు వెళ్తుండగా భారీ పేలుడు శబ్దాలు రావడంతో అక్కడ కూడా గాలిస్తున్నారు.
ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేండ్లు
ఆర్టికల్ 370 రద్దు అమల్లోకి వచ్చి నాలుగేండ్లు అయిన సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్, పీడీపీ, ఎన్సీ, శివసేన(ఉద్ధవ్ వర్గం) ..తదితర పార్టీలు శనివారం బ్లాక్ డే పాటించాయి. స్వయం ప్రతిపత్తిని రద్దు చేయటం ద్వారా ప్రజలకు మోదీ సర్కార్ తీరని అన్యాయం చేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. జమ్ము, శ్రీనగర్ తదితర చోట్ల శివసేన(ఉద్ధవ్వర్గం), పీడీపీ, కాంగ్రెస్ వేరు వేరుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీని, ఆ పార్టీ నేతల్ని పోలీసులు శనివారం హౌస్ అరెస్టు చేశారు. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కార్యాలయాలకు సీల్ వేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అమర్నాథ్ యాత్రను కూడా అధికారులు నిలిపివేశారు.