న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని వరద (Delhi Floods) ముంచెత్తింది. యమునా నది 45 ఏండ్ల గరిష్టస్ధాయిలో ప్రవహిస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇక ఢిల్లీలోని ముకుంద్పూర్లో వరద నీటిలో స్నానం చేస్తూ ముగ్గురు చిన్నారులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.
పిల్లలు నిర్మాణ స్ధలంలో ఉన్న నీటి గుంటలోకి దిగి స్నానం చేస్తుండగా మృత్యువాత పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు. మరణించిన వారిని పీయూష్ (13), నిఖిల్ (10), ఆశిష్ (13)లుగా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఇక కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటి ప్రవాహం 208.25 మీటర్లకు తగ్గినా ఇంకా నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిఉంది. అత్యవసరమైతే మినహా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస శిబిరాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు కోరుతున్నారు.
Read More :