లక్నో : వారణాసిలోని ఐఐటీ-బీహెచ్యూ విద్యార్ధినిపై లైంగిక వేధింపుల కేసులో (Varanasi Molestation Case) అరెస్టయిన ముగ్గురు నిందితులను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. ఈ కేసులో నిందితులు ముగ్గురిని పార్టీ నుంచి బహిష్కరించామని బీజేపీ జిల్లా చీఫ్ హన్స్రాజ్ విశ్వకర్మ తెలిపారు.
పార్టీలో అరెస్టయిన నిందితుల హోదా, బాధ్యతలు ఏంటనేది ఆయన వెల్లడించలేదు. నిందితులు బీజేపీ సభ్యులని విపక్ష నేతలు ఆరోపణలు చేసిన క్రమంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. పోలీసుల విచారణలో నిందితుల పేర్లు వెలుగులోకి రావడంతో పార్టీ తక్షణమే వారిపై వేటు వేసిందని విశ్వకర్మ వివరించారు.
నిందితులను పార్టీ నుంచి బహిష్కరించామని, పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. ఇక నిందితులను కునాల్ పాండే, ఆనంద్ చౌహాన్, సాక్షం పటేల్గా గుర్తించిన పోలీసులు వారిని ఆదివారం అదుపులోకి తీసుకుని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కాగా విద్యార్ధినిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన నిందితులు బీజేపీ సభ్యులని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
Read More :