Tamil Nadu | చెన్నై : తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 95 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. ట్యూటికోరిన్, తిరునేల్వేలి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
ఇక దక్షిణ తమిళనాడు, కేరళలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో మంగళవారం వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 24 గంటల తర్వాత వర్షపాతం తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. దీంతో తమిళనాడులోని దక్షిణ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఈ సీజన్లో తిరునేల్వేలి జిల్లాలో అత్యధికంగా 76 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 61 శాతం అధికమని పేర్కొన్నారు. ట్యూటికోరిన్లో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు సాధారణంగా 34.9 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో డిసెంబర్ 17వ తేదీ నాటికి 39.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
కేరళలోని ఇడుక్కి, తిరువనంతపురం జిల్లాల్లో కూడా గడిచిన 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. పంపదుంపరలో అత్యధికంగా 9 సెం.మీ., వట్టవడలో 8 సెం.మీ., మైలదుంపుర, తత్తతుమలలో 7 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.