Jairam Ramesh: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, సీనియర్ పొలిటీషియన్ జైరామ్ రమేశ్ ఈవీఎంల (EVMs)పై కేంద్ర ఎన్నికల సంఘానికి (CEC) మరో లేఖ రాశారు. ఇప్పటికే డిసెంబర్ 30న INDIA కూటమి తరఫున తాను రాసిన లేఖకు ఈసీ ఇచ్చిన సమాధానంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆ మేరకు ఈసీ సమాధానాన్ని తప్పుపడుతూ మరో లేఖ రాశారు.
ఈవీఎంలు, వీవీ ప్యాట్స్పై నెలకొన్న సందేహాలపై చర్చించి, అవసరమైన సలహాలు ఇవ్వడం కోసం తాను గత లేఖలో ఈసీతో భేటీకి సమయం కోరానని, కానీ ఈసీ తన డిమాండ్ను అంగీకరించలేదని, పైగా వారి అధికారిక వెబ్సైట్లోని FAQs చదువుని సందేహాలు నివృత్తి చేసుకోవాలంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చిందని జైరామ్ రమేశ్ ఆరోపించారు.
ఈసీ అధికారిక వెబ్సైట్లోని FAQs లో మా ప్రశ్నలకు సమాధానాలు లేవని తెలుపగా.. మా ప్రశ్నలే తప్పుడువని ఈసీ నిర్ధారణ చేసిందని జైరామ్ రమేశ్ విమర్శించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్స్పై ప్రజల సమక్షంలో చర్చ జరగాలని మేం ఎందుకు పట్టుబట్టడుతున్నామో.. ఈసీ సమాధానం స్పష్టం చేస్తున్నదని ఆయన చెప్పారు. అందుకే తాము ఈవీఎంలు, వీవీప్యాట్స్ పనితీరుపై సందేహాలు లేవనెత్తుతున్నామన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఈసీకి రాసిన లేఖను ఎక్స్లో పోస్ట్ చేశారు.