న్యూఢిల్లీ: కేంద్రం తాజాగా రద్దు చేసిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనల సమయంలో మొత్తం 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కేంద్రం గత సోమవారం పార్లమెంట్ ఉభయసభల్లో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప జేసుకున్నది. ఎట్టకేలకు చట్టాలు రద్దయినా ఆ చట్టాల రద్దు కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పార్లమెంట్లో చేసిన ప్రకటన దుమారం రేపుతున్నది. ఆందోళనల్లో మరణించిన రైతులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర రికార్డులు లేవని, కాబట్టి వాళ్ల కుటుంబాలకు పరిహారం చెల్లించడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రకటనను కాంగ్రెస్ రాజ్యసభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే తప్పుపట్టారు. రైతుల మరణాలకు సంబంధించి రికార్డులు లేవని చెప్పడం వారికి తీవ్ర అవమానమన్నారు. కేంద్రం అలాంటి ప్రకటన ఎలా చేస్తుందని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఆందోళనల్లో చనిపోయిన 700 మంది రైతుల డేటానే సేకరించలేకపోతే.. కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన లక్షల మంది డేటాను కరెక్టుగా సేకరించిందని ఎలా నమ్మగలమని ఖర్గే అనుమానం వ్యక్తం చేశారు. గడిచిన రెండేండ్లలో కరోనా కారణంగా 50 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోతే.. ప్రభుత్వం మాత్రం కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే మరణించినట్లు చెబుతున్నదని ఆయన విమర్శించారు.